కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ (68) దారుణ హత్యకు గురయ్యారు. ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాల నేపథ్యంలో భార్యే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓం ప్రకాశ్ బిహార్లోని చంపారన్కు చెందిన వ్యక్తి. 2015 మార్చి 1న కర్ణాటక డీజీపీగా బాధ్యతలు చేపట్టి, 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నివసిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన భార్య పల్లవి ఇచ్చిన సమాచారంతో ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఓం ప్రకాశ్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కొద్ది రోజులుగా ఆస్తి వివాదాల కారణంగా భార్య పల్లవి, ఇతర కుటుంబ సభ్యులతో ఓం ప్రకాశ్ గొడవ పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల ఆయన ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగిన ఉదంతం మాధ్యమాల్లో ప్రసారమైంది. ‘ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్’లోనూ తన భర్త ప్రకాశ్.. కుటుంబ సభ్యులను తీవ్రంగా హింసిస్తున్నారని, ఇంట్లో తుపాకీతో తిరుగుతున్నారని పల్లవి మెసేజ్లు పోస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఈ గొడవ తీవ్రరూపం దాల్చడంతో ఆమె భర్తను పలుమార్లు పొడిచి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం మరో మాజీ డీజీపీకి ‘ఐ హ్యావ్ ఫినిష్డ్ మాన్స్టర్’ అంటూ ఫోనులో మెసేజ్ పెట్టారు. డీజీపీ అలోక్ మోహన్, బెంగళూరు నగర కమిషనర్ బి.దయానంద్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుడి భార్య పల్లవి, కుమార్తె, కోడళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.